హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలకు చెందిన కొవిడ్ బాధితులు చికిత్సకోసం హైదరాబాద్కు రావాలంటే ముందస్తుగా దవాఖానలో బెడ్ రిజర్ప్ చేసుకున్నాకే బయల్దేరాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్స్లను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. నిన్నరాత్రి నుంచి ఇప్పటివరకు ఏడుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అనుమతించామని తెలిపారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వెంటనే అనుమతిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల బాధితులెవరైనా నిబంధనల మేరకు తెలంగాణలో వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే వేలాది మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఆయన తెలిపారు. 45 శాతం పడకల్లో ఇతర రాష్ట్రాల రోగులకు చికిత్స అందతున్నదని గుర్తుచేశారు. ‘‘ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయమని మేం చెప్పలేదు.
ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టుకోవాలని మేం అనుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల రోగుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఆక్సిజన్ ఆడిట్ విధానం పెట్టాం. ఆన్లైన్లో పడకల వివరాలను తెలియజేస్తూ డ్యాష్బోర్డు పని చేస్తున్నది. బాధితులు నేరుగా కాల్ సెంటర్కు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు.
దవాఖానలే వైద్య ఆరోగ్యశాఖకు వివరాలు అందిస్తాయి. దవాఖానకు పంపిన వివరాలను పరిశీలించి అనుమతులు ఇస్తాం. ఏపీ, ఛత్తీస్ఘడ్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన బాధితులు చికిత్సకోసం హైదరాబాద్కు వస్తున్నారు. వీరందరికీ నిబంధనల మేరకు చికిత్స అందిస్తాం’’ అని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.