లక్నో : ఉత్తరప్రదేశ్లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ భారతీయ జనతా పార్టీనే గెలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. 350 స్థానాల్లో తప్పకుండా విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన నాలుగున్నరేండ్లు పూర్తయిన సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ పాలనపై యూపీ ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. తమ పనితీరే బీజేపీని గెలిపిస్తుందన్నారు. గత ముఖ్యమంత్రులు తమ బంగ్లాలన ఎలా నిర్మించుకోవాలని పోటీ పడేవారు. కానీ ఇప్పుడు కొత్త ఇండియాలోని కొత్త యూపీలో 42 లక్షల మంది పేద ప్రజలకు ఇండ్లు నిర్మించామని తెలిపారు. 2017లో తాము అధికారంలోకి వచ్చాక యూపీలో శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని యోగి పేర్కొన్నారు.
2017 కంటే ముందు యూపీలో నేరస్తుల, మాఫియా ఆగడాలు అధికంగా ఉండేవి. భయానక వాతావరణాన్నిసృష్టించారు. అవినీతికి అడ్డాగా మారిపోయింది. రెండు, మూడు రోజులకొక సారి అల్లర్లు జరిగేవి. తాను సీఎం అయ్యాక నేరస్తులను ఉక్కుపాదంతో అణిచివేశాం. శాంతి భద్రతలను కాపాడామని యోగి స్పష్టం చేశారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325, సమాజ్వాదీ పార్టీ 54, బీఎస్పీ 19, ఇతరులు 5 సీట్లలో గెలుపొందారు. యూపీలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 403.