న్యూఢిల్లీ : దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సర్వీసులను పునరుద్ధరించగా.. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 21 నుంచి పలు మార్గాల్లో నడిచే ట్రైన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. ఇందులో శతాబ్ది, దురంతో సహా 29 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు ఈ నెల 25 నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లను గోరఖ్పూర్ నుంచి బాంద్రా టెర్మినస్ వరకు నడుపుతామని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ – కల్కా శతాబ్ది, న్యూఢిల్లీ – డెహ్రాడూన్ శతాబ్ది, న్యూ ఢిల్లీ – అమృత్సర్ జంక్షన్ శతాబ్ది, ఢిల్లీ సారాయ్ రోహిల్లా – జమ్ముతావి దురంతో ఎక్స్ప్రెస్, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా – న్యూఢిల్లీ శ్రీ శక్తి ఎక్స్ప్రెస్, లక్నో – ప్రయాగ్రాజ్ సంగం ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఈ నెల 21 నుంచి నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.