UP Assembly Polls | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ పావులు కదుపుతున్నది. తొలి రెండు దశల పోలింగ్ జరిగే అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆచితూచి వ్యవహరించింది. వివిధ సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపులో మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఫార్ములా అనుసరించింది. అన్ని కులాలను ప్రత్యేకించి ఓబీసీలు, దళితులను ఏకం చేసి హిందుత్వ చట్రంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీ ఇన్చార్జీ కేంద్ర హోంమంత్రి అమిత్షా మార్గదర్శకత్వంలో అభ్యర్థుల ఖరారు జరిగినట్లు తెలుస్తున్నది.
యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ముగ్గురు ఓబీసీ నేతలతోపాటు మరో ఆరుగురు ఓబీసీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి ఓబీసీలు దూరం అవుతున్నారని విపక్షాలు ప్రచారం చేపట్టినా, అభ్యర్థుల ఎంపికలో కమలనాథులు ఆచితూచి స్పందిస్తున్నారు. 1991 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తేవడానికి కల్యాణ్ సింగ్ అమలుచేసిన ఫార్ములా.. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓబీసీలు, దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించింది.
బీజేపీ తొలి జాబితాలో 44 మంది ఓబీసీలు, 19 మంది దళితులకు టిక్కెట్లు కేటాయించింది. తొలి రౌండ్ పోలింగ్ జరిగే స్థానాల్లో దాదాపు 60 శాతం మందికి టిక్కెట్ల పంపిణీ పూర్తయినట్లేనని భావిస్తున్నారు. ఒకవేళ జాట్ సిక్కుల నుంచి ఎంపిక చేసిన బాల్దేవ్సింగ్ ఔలఖ్ను ఓబీసీగా కలుపుకుంటే మొత్తం ఓబీసీలకు 45 సీట్లు కేటాయించినట్లే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 44 మంది ఓబీసీలను బీజేపీ నిలిపింది. దళితులకు కూడా గణనీయ స్థాయిలో కేటాయించింది. 2019 ఎన్నికల్లో దళిత, ముస్లింల కాంబినేషన్తో బీఎస్పీ 10 స్థానాలు గెలుచుకున్నది. 2014లో గెలిచిన 9 స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది.
కానీ ఇప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇన్యాక్టివ్గా కనిపిస్తుండటంతో దళితుల ఓట్లు తమకు షిఫ్ట్ అవుతాయని బీజేపీ అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎస్సీల్లో 13 మంది జాతవ్ సామాజిక వర్గానికి కేటాయించింది. వెస్ట్ యూపీ రీజియన్లో జాతవ్ల జనాభా గణనీయంగానే ఉండటం గమనార్హం. యూపీలో ఆగ్రం.. దళితులకు రాజధాని అని పెట్టింది పేరు. ఇక అగ్రకులాల్లో గరిష్ఠంగా ఠాకూర్లు, బ్రాహ్మణులు, వైశ్యులకు టికెట్లు కేటాయించింది బీజేపీ. ఇక గత ఎన్నికలతో పోలిస్తే, ఈ దఫా మహిళలకు కేటాయించిన సీట్లు 13 నుంచి 10కి పడిపోయాయి. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించారని బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఓబీసీలకు 44 సీట్లు కేటాయిస్తే అందులో 16 జాట్లవే. గుర్జార్లకు ఏడు, లోధ్లకు 6, షైనీలకు 5, శాక్యలకు రెండు సీట్లు లభించాయి. జాట్ సిక్కుకు ఒక సీట్ కేటాయించింది బీజేపీ. 43 స్థానాలు ఉన్నత కులాలకు కేటాయిస్తే వాటిల్లో అగ్రతాంబూలం ఠాకూర్లకే. అత్యధికంగా ఠాకూర్లకు 18, బ్రాహ్మణులకు 10, వైశ్యులకు 8, పంజాబీలకు 3, కాయస్త, త్యాగిలకు రెండేసి స్థానాలను కేటాయించారు. దళితుల్లో జాతవ్లకు 13, వాల్మికి రెండు, పాసీ, దోబీ, బంజారా, ఖటిక్లకు ఒక్కో టికెట్ ఇచ్చింది.