న్యూఢిల్లీ : రెండు నెలల గరిష్ట స్ధాయిలో మంగళవారం కేరళలో అత్యధిక కేసులు వెలుగుచూడటం, పాజిటివిటీ రేటు 12.35 శాతానికి ఎగబాకడంతో కేరళ మోడల్పై కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 50 శాతం కేరళలోనే వెలుగుచూస్తున్నాయని బీజేపీ నేత సంబిట్ పాత్ర పేర్కొన్నారు. కరోనా నియంత్రణలకు బక్రీద్ సందర్భంగా సడలింపులు ఇవ్వడంతోనే మహమ్మారి వ్యాప్తి చెందిందని ఆరోపించారు.
బక్రీద్ సడలింపులతో ఇన్ఫెక్షన్లు పెరిగిపోతే కన్వర్ యాత్ర, కుంభమేళాలను సాకుగా చూపుతున్నారని అంటూ ఇదేనా కేరళ మోడల్ అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం పినరయి విజయన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. బక్రీద్ సడలింపులతో మహమ్మారి వ్యాప్తి చెందిందని, దీనిపై సెక్యులరిస్టులు మౌనం దాల్చారని మండిపడ్డారు. కేరళలో తాజాగా కరోనా బారినపడి 156 మంది మరణించడంతో రాష్ట్రంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 16,326కు పెరిగింది.