న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని రాష్ట్రాలు పంపిన సమాచారంతో రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్రాలు కేంద్ర పాలితప్రాంతాలు ఎప్పటికప్పుడు కరోనా కేసులు, మరణాలపై కేంద్రానికి రిపోర్ట్ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో వివరించారని బీజేపీ నేత సంబిట్ పాత్రా పేర్కొన్నారు.
కరోనా మరణాలను నివేదించడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నివేదికల ప్రకారం ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ మరణించిన వివరాలను ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వెల్లడించలేదని బీజేపీ నేత తెలిపారు. కరోనా మరణాలపై పెద్దన్న రాహుల్, చిన్నన్న కేజ్రీవాల్లు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ ఐక్యం కావాల్సిన తరుణంలో కొందరు రాజకీయ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.