కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆ రాష్ర్ట బీజేపీ నాయకత్వం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. బెంగాల్లోని ప్రతి ఒక్కరికి టీకా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వ్యాక్సినేషన్ సరళీకరణ వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహం మార్కెట్ శక్తులకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన రెండవ లేఖలో దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి కొవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.