ఢిల్లీ ,మే11: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది.
2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉండవచ్చని ఇదివరకు అంచనా వేసిన బార్క్లేస్ తాజాగా దీనిని 10 శాతానికి తగ్గించింది. కరోనా కట్టడికి ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా విధించిన లాక్డౌన్లు జూన్ చివరి వరకు కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు 38.4 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని బార్క్లేస్ వెల్లడించింది. ఇండియా కరెన్సీలో రూ.2,83,533 కోట్లు ఉండనున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది.