న్యూఢిల్లీ: కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న బీజేపీకి ప్రతి ఏటా వచ్చే విరాళాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 2019-2020 ఏడాదికిగాను ఆ పార్టీకి రూ.785.77 కోట్ల విరాళాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను బీజేపీ ఫిబ్రవరి 12నే ఎన్నికల సంఘానికి సమర్పించినా.. ఈసీఐ మాత్రం మంగళవారం రాత్రి దీనిని పబ్లిష్ చేసింది. చెక్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసిన రూ.20 వేలు, అంతకన్నా ఎక్కువ విరాళాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆ ఏడాదిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు రావడం గమనార్హం.
ఈ మొత్తం విరాళాల్లో రూ.217.75 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి. ఈ ట్రస్ట్ ప్రతిగా డీఎల్ఎఫ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ నుంచి విరాళాలు అందుకుంది. ఇక జన్కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి మరో రూ.45.95 కోట్లు వచ్చాయి. ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.9 కోట్లు, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.3.75 కోట్లు అందుకుంది.
ఇక ఇతర జాతీయ పార్టీల విషయానికి వస్తే.. కాంగ్రెస్ రూ.139.01 కోట్లు విరాళాలుగా అందుకోవడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ రూ.8.08 కోట్లు, సీపీఐ రూ.1.29 కోట్లు అందుకున్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపాయి. అదే సీపీఎంకు రూ.19.69 కోట్లు, ఎన్సీపీకి రూ.59.94 కోట్లు రాగా.. బీఎస్పీ మాత్రం అసలు ఎలాంటి విరాళాలు రాలేవని చెప్పింది.