చండీఘఢ్ : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, బీజేపీల మధ్య అవగాహన దిశగా అడుగులు పడుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ఏర్పాటు చేసే కొత్త పార్టీ కాషాయ పార్టీతో సీట్ల సర్ధుబాటు చేసుకుంటుందని కెప్టెన్ సింగ్ వెల్లడించిన క్రమంలో ఈ ప్రతిపాదన పట్ల బీజేపీ సానుకూలంగా స్పందించింది. అమరీందర్ సింగ్ను దేశభక్తుడు అంటూ కాషాయ పార్టీ ఆకాశానికి ఎత్తేసింది. దేశ ప్రయోజనాలను ముందుకు తెచ్చే ఏ పార్టీతోనైనా తాము చేతులు కలుపుతామని బీజేపీ స్పష్టం చేసింది.
కెప్టెన్ సింగ్ వారసత్వ రాజకీయాల నుంచి బయటకు వచ్చి జాతీయవాదం దిశగా అడుగులు వేయడం శుభపరిణామమని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దుష్యంత్ గౌతం సింగ్ అన్నారు. అమరీందర్ ప్రతిపాదించిన రైతుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కట్టుబడిఉందని చెప్పారు. చర్చల ద్వారా రైతులు లేవెనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని అన్నారు.