హాజరైన స్పీకర్ పోచారం
తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
బీర్కూర్, మార్చి 21 : మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవి-భూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కల్యాణం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమానికి త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం త్రిదండి దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ.. పరమాత్ముడు ఎక్కడో లేడని కోట్లాది జీవరాశుల ఆత్మలోనే ఉన్నాడని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవడం అలవర్చుకోవాలన్నారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ రూ. 13 కోట్లతో రాజగోపురాలు, గాలి గోపురాలు, పుష్కరిణి, కోనేరు తదితర వాటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవంలో 11 జంటలు కూర్చున్నాయి. కార్యక్రమంలో పోచారం ప్రమీల-శంభురెడ్డి దంపతులు, పోచారం సోనీరెడ్డి-భాస్కర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డి, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ రామకుమారి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, ద్రోణవల్లి సతీశ్, భోగవల్లి అప్పారావు, పెర్క శ్రీనివాస్, నర్సరాజు, రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నృత్యం చేసిన స్పీకర్ పోచారం
శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఓ చిన్నారితో కలిసి నృ త్యం చేయగా, భక్తులు కరతాళ ధ్వనులు చేశారు.