న్యూఢిల్లీ: చెన్నై ఎంపీ దయానిధి మారన్ ఓ మధుర జ్ఞాపకాన్ని తన ట్విట్టర్లో పంచుకున్నారు. సహచర పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ ఎలా తనకు షాక్ ఇచ్చారో ఆ పోస్టులో వ్యక్తపరిచారు. ఢిల్లీ నుంచి చెన్నైకు ఇండిగో విమానంలో బయలుదేరిన మారన్కు.. మరో ఎంపీ రాజీవ్ ప్రతాప్ ఓ జలక్ ఇచ్చారు. విమానంలో మొదటి వరుసలో కూర్చున్న దయానిధి మారన్తో.. పైలెట్ దుస్తుల్లో.. మాస్క్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి మాటలు కలిపారు. ఈ ఫ్లయిట్లో మీరు కూడా ఉన్నారా అని ఆ పైలెట్ అడిగారు. విమాన కెప్టెన్గా కనిపిస్తున్న ఆ వ్యక్తిని మారన్ గుర్తుపట్టలేదు. కానీ ఏదో తెలిసినట్లు తల ఊపారు. మాట విన్నట్లు గుర్తుపట్టినా.. కెప్టెన్ దుస్తుల్లో ఉంది ఎవరో మారన్ పసికట్టలేకపోయారు.
మాస్క్ వేసుకుని స్మైల్ ఇచ్చిన ఆ కెప్టెన్ ఎవరో కాదు ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ అని మారన్ లేటుగా తెలుసుకున్నారు. దీంతో ఎంపీ మారన్ కాస్త షాకయ్యారు. ఈ సంఘటనకు రెండు గంటల ముందే పార్లమెంట్లో జరిగిన ఎస్టిమేట్స్ కమిటీ చర్చలో ఇద్దరూ పాల్గొన్నారు. అయితే ఓ ఎంపీ ఎలా విమాన పైలెట్ అయ్యారో మారన్కు అర్థం కాలేదు. దీంతో ఆయన కొంచెం సేపు ఆశ్చర్యానికి లోనయ్యారు. మీరు మా ఫ్లయిట్ నడుపుతున్నారా అని మారన్ అడిగారు. దీంతో రాజీవ్ ప్రతాప్ రూఢీ నవ్వుతూ.. అవును, అప్పుడప్పుడు ఫ్లయిట్ నడుపుతుంటానని సమాధానం ఇచ్చారు.
గతంలో కేంద్రమంత్రిగా చేసిన రాజీవ్ ప్రతాప్ రూఢీ ఫ్లయిట్ ఎలా నడుపుతారని మారన్ కాస్త అయోమయంలో పడ్డారు. ఎంపీ రూఢీ.. ఎలా కమర్షియల్ పైలెట్ అయ్యారో మారన్కు అర్థంకాలేదు. కానీ ఆ విమాన ప్రయాణంలో చోటుచేసుకున్న సంఘటనలను ఎంపీ మారన్ తన ట్విట్టర్లో వివరించారు. ఢిల్లీ నుంచి చెన్నైకి సురక్షితంగా చేరవేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇది మరిచిపోలేని విమాన ప్రయాణం అని మారన్ చేసిన ట్వీట్కు తెగ లైక్లు వస్తున్నాయి.
నిజానికి ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీకి.. కమర్షియల్ ఫ్లయింగ్ లైసెస్సు ఉంది. ఆ లైసెన్సును రెన్యూవల్ చేసుకునేందుకు అప్పుడప్పుడు ఆయన ఫ్లయిట్లు నడుపుతుంటారని తెలిసింది. గతంలో పలుమార్లు ఆయన కేంద్ర మంత్రులను విమానంలో తీసుకువెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఎయిర్బస్ 320 విమానాన్ని కూడా ఆయన నడిపారు. 4వేల గంటల పాటు కమర్షియల్ విమానాలు నడిపిన అనుభం ఎంపీ రాజీవ్ ప్రతాప్కు ఉంది. 2003లో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా చేశారు కూడా. ప్రస్తుతం లోక్సభకు ఆయన ఎంపిక కావడం ఇది నాలుగవసారి. సుఖోయ్, గ్రిప్పెన్, రాఫేల్ లాంటి యుద్ధ విమానాల్లోనూ రాజీవ్ ప్రతాప్ రూడీ విహరించారట.