కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ చర్యలు
నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక దృష్టి
అందుబాటులో ఆరోగ్య సిబ్బంది
విద్యార్థులకు నిబంధనలపై అవగాహన
భౌతిక దూరం, మాస్కు తప్పనిసరంటూ ఆదేశాలు
హాస్టల్ పిల్లలకు ఐసొలేషన్ సౌకర్యం, చికిత్స
ఆందోళన వద్దని తల్లిదండ్రులకు సూచన
ఆదిలాబాద్, మార్చి 19 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పాఠశాలల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూనే, శానిటైజేషన్ ప్రక్రియ నిత్యం కొనసాగిస్తున్నారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో శుక్రవారం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిపి 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హాస్టల్ విద్యార్థులు అక్కడే ఐసొలేషన్లో ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నిత్యం 600 మందికి కొవిడ్ టెస్ట్లు చేస్తున్నామని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగగా, జిల్లాకు క్రమంగా విస్తరిస్తున్నది. నిత్యం 35 నుంచి 45 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో 6 నుంచి 10 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో కూడా తరగతులు నడుస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరుశాతం 61 శాతం ఉంది. శుక్రవారం వరకు విద్యాసంస్థల్లో 36 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.
పకడ్బందీ చర్యలు..
జిల్లాలోని విద్యాసంస్థల్లో కరోనా నియంత్రణలో భాగంగా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా బెంచీకి ఒక్కరినే కూర్చోపెడుతున్నారు. నిత్యం పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించడంతో పాటు చేతు లు శానిటైజర్తో శుభ్రంగా ఉంచుకునేలా చూస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఏఎన్ఎంలు, హెల్త్ వర్కర్లు అందుబాటులో ఉండేలా చూడడంతో పా టు వ్యాధి లక్షణాలున్న వారికి పరీక్షలు చేస్తున్నారు. కేసుల నేపథ్యంలో విద్యాసంస్థల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచారు. నిత్యం 600 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు అక్కడే ఐసొలేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు వైద్యసేవలు అందిస్తున్నా రు. జిల్లా విద్యాధికారితో పాటు మండల స్థాయి అధికారులు రో జు పాఠశాలలను పర్యవేక్షిస్తూ ,వైరస్ నియంత్రణకు తీసుకుంటు న్న చర్యలను పరిశీలిస్తున్నారు.