జైపూర్: రాజస్థాన్లో ముస్లింలు ల్యాండ్ జిహాదీకి పాల్పడుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే కన్హయ్య లాల్ ఆరోపించారు. మాల్పురా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో మాట్లాడుతూ ముస్లింలు స్థానిక హిందువుల భూముల్ని లాగేసుకుంటున్నట్లు తెలిపారు. మాల్పురా పట్టణం చాలా సున్నితమైందని, ఇక్కడ 1950 నుంచి ఎప్పుడూ మత ఘర్షణలే జరుగుతున్నాయని, ఆ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు వందలాది మంది హిందువులు మరణించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే ముస్లిం వర్గీయులు ఓ ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడి చేస్తున్నారని, హిందువులకు చెందిన భూములు, ఇండ్లను తక్కువ ధరకు ఖరీదు చేసి, అక్కడ అక్రమంగా జీవించడం మొదలు పెడుతున్నారని, ఆ తర్వాత అక్కడ పొరుగున ఉండే హిందు ఫ్యామిలీలతో తరుచూ గొడవలకు దిగుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హిందూ కూతుళ్లు, సోదరీమణులను ముస్లింలు వేధిస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే తన అసెంబ్లీ ప్రసంగంలో తెలిపారు. అభ్యంతరకరమైన రీతిలో సంకేతాలు ఇస్తున్నారని, సంభాషణలు కూడా చేస్తుంటారని అన్నారు. దీంతో అక్కడ ఉన్న హిందువులు అభద్రతాభావంలోకి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. ఆ కారణంగానే బస్తీల్లో ఉన్న సుమారు 800 హిందూ కుటుంబాలు వలస వెళ్లినట్లు తెలిపారు. 9 వార్డులకు చెందిన హిందువులు వలస బాటపట్టినట్లు ఆయన ఆరోపించారు. జైన మందిరాలు ఉన్న చోట .. ముస్లింలు తినేసి ఎముకల్ని వదిలి వెళ్తున్నారని కూడా తెలిపారు.