కోల్కతా, జూన్ 11: బెంగాల్ బీజేపీకి బీటలు వారుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కాషాయపార్టీని వీడి సొంతగూటికి చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సమక్షంలో ఆయన తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆయన కుమారుడు సుభ్రాన్షు కూడా తృణమూల్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మమతాబెనర్జీ మాట్లాడుతూ.. ముకుల్రాయ్ తిరిగి సొంతింటి వచ్చారని పేర్కొన్నారు. ఆయన ఎన్నడూ తృణమూల్కు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. ఇతరులలాగా ఆయన నమ్మక్రదోహం చేయలేదన్నారు. ఓల్డ్ ఎప్పటికీ గోల్డేనని పేర్కొన్నారు. గతంలో పార్టీలో ఆయన ఏ పాత్ర పోషించారో, ఇకపైనా అదే పాత్ర పోషిస్తారని తెలిపారు. బీజేపీలో ముకుల్ను బెదిరించారని, వేధించారని.. దీంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆరోపించారు. అనంతరం ముకుల్రాయ్ మాట్లాడుతూ.. పాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను బీజేపీలో ఉండలేకపోయాయని చెప్పారు. బెంగాల్, భారత్కు మమతే ఏకైక నాయకురాలని అభివర్ణించారు. దీదీపై విమర్శలు చేయడం మీద మీడియా పదేపదే ప్రశ్నించగా.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని బదులిచ్చారు. ఈ క్రమంలో మమత జోక్యం చేసుకుని విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించొద్దని మీడియాను కోరారు.
సువేందుకే ప్రాధాన్యం!
యూత్ కాంగ్రెస్తో రాజకీయ జీవితం మొదలుపెట్టిన ముకుల్రాయ్.. 1998లో మమతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ నెలకొల్పారు. ప్రారంభం నుంచి పార్టీలో కీలకంగా పనిచేశారు. నంబర్ 2గా ఎదిగారు. 2011లో పార్టీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే మమతతో విభేదాలతో 2017లో ఆయన బీజేపీలో చేరారు. బెంగాల్లో కాషాయపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడంలో ముకుల్ కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నించినప్పటికీ అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ అధిష్టానం ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించింది. మరోవైపు, పార్టీలోకి సువేందు అధికారి రావడంతో ముకుల్రాయ్కి ప్రాధాన్యం తగ్గింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష నేతగా సువేందును నియమించడం ఆయనకు మింగుడుపడలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీలో తనకు ఊపిరిసలపడం లేదని, ఒత్తిడి పెరిగిందని ఆయన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. ఇటీవల ముకుల్ రాయ్ భార్యకు కరోనా సోకగా, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దవాఖానకు వెళ్లి ఆయనను పరామర్శించారు.
తృణమూల్ ఘర్వాపసీ
అసెంబ్లీ ఎన్నికలకు మునుపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. అధికార తృణమూల్తోపాటు వివిధ పార్టీల్లోని కీలక నేతలను తమవైపు తిప్పుకుంది. అయితే ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంతో పరిస్థితి రివర్స్ అయింది. తృణమూల్ నుంచి చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. బీజేపీలో చేరి తప్పుచేశామని, తిరిగి పార్టీలో చేర్చుకోమని పలువురు నేతలు ఇప్పటికే దీదీకి విన్నవించుకున్నారు. బిపేందు బిశ్వాస్, సోనాలి గుహ, సర్లా ముర్ము, అమోల్ ఆచార్య వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ మంత్రి రజిబ్ బెనర్జీ, మాజీ ఎమ్మెల్యే ప్రబిర్ ఘోషల్ వంటి నేతలు కూడా తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు పార్టీని వీడినవారిని తిరిగి చేర్చుకునేది లేదని మమత స్పష్టంచేశారు.