కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్ జిల్లా సబజ్పుత్ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పాల్పడి ధ్వంసం చేశారు.తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు రామ్ గోవింద్దాస్ ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని సుమేందు ఆయన సోదరుడు దివ్వేందు అధికారి ఆరోపించారు.
ఆ ప్రాంతంలో మూడు పోలింగ్ కేంద్రాల్లో తృణమూల్ నేత రిగ్గింగ్కు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఈ దాడిలో తాను క్షేమంగా బయటపడ్డానని సుమేందు అధికారి వెల్లడించారు. మూడు పోలింగ్ కేంద్రాల్లో తృణమూల్ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని తాను ఇక్కడకు రావడంతో వారు రెచ్చిపోయి తన వాహనంపై దాడి చేసి డ్రైవర్ను తోసివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈసీ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లామని దివ్యేందు అధికారి తెలిపారు.