న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కేసులో బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయతో పాటు మరో అయిదుగుర్ని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి వరకు అశ్వినిని పోలీసులు విచారించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కొన్ని వీడియోలు బయటకు రావడంతో పోలీసులు ఈ కేసును చేపట్టారు. హిందుస్తాన్ మే రెహనా హోగా.. జై శ్రీరామ్ కహనా హోగా అంటూ అరుస్తున్న ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న అశ్వినిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నలు తలెత్తాయి. ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు. మరో బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నా.. వీడియోల్లో మాత్రం అతను కనిపించలేదు.
బ్రిటీష్ చట్టాలకు వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఫౌండేషన్ ఆందోళన చేపట్టిందని, తనకు ఆ ఫౌండేషన్తో ఎటువంటి లింకు లేదని, కేవలం అతిథిగా మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అశ్విని తెలిపారు. సేవ్ ఇండియా డైరక్టర్ ప్రీత్ సింగ్ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వినోద్ శర్మ, దీపక్ సింగ్, వినీత్ క్రాంతిలు ఉన్నారు.