అహ్మదాబాద్: మరో 15 నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ హఠాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యమంత్రే కాదు.. పలువురు మంత్రులను కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ కేబినెట్లో భారీ మార్పులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో అసలు రూపానీ రాజీనామాకు గల కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరెస్సెస్ సర్వే తేల్చిందేంటి?
ఆరెస్సెస్ ఓ సర్వే నిర్వహించిందని, అందులో విజయ్ రూపానీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే బీజేపీ గెలవబోదని తేలినట్లు సంఘ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ జన్ సంవేదన యాత్ర సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు కొవిడ్ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకూ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రూపానీని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లడం మరింత రిస్క్ అని కూడా సంఘ్ సర్వే తేల్చింది. దీనికితోడు 27 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న బీజేపీపై సహజంగానే తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
రెండు రోజుల కిందట అమిత్ షా కూడా సడెన్గా గుజరాత్ పర్యటనకు వెళ్లారు. రాత్రి వేళ ఆ రాష్ట్రానికి వెళ్లిన ఆయన.. మరుసటి రోజు ఉదయమే మళ్లీ ఢిల్లీ వచ్చారు. అప్పుడే బీజేపీ సీనియర్ నేతలతో సమావేశమైన అమిత్ షా.. రూపానీని తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే నేతను సీఎంగా చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రూపానీ రాజీనామాపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే రూపానీ ప్రభుత్వం ఐదేళ్లయిన సందర్భంగా సంబురాలు జరుపుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వం విజయవంతమైతే మరి ఎందుకు రూపానీ రాజీనామా చేశారని ప్రశ్నించింది.