శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ప్రజలు శోకంలో ఉంటే, బీజేపీ సంబరాలు చేసుకోవడం దురదృష్టకరమని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. గురువారం నాటికి రెండేండ్లైన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో శ్రీనగర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని, అనాగరికంగా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. దీనిని తాము ఎదుర్కొంటామని, ఆక్రమిత ప్రాంతాలపై పాకిస్థాన్తో చర్చలు జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దు జరిగి గురువారం నాటికి రెండేండ్లైన సందర్భంగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ‘రెండేళ్ల క్రితం నాటి బ్లాక్ డేలో జమ్ముకశ్మీర్కు కలిగిన నొప్పి, హింస, తిరుగుబాట్లను వర్ణించడానికి పదాలు లేదా చిత్రాలు సరిపోవు. అనియంత్రిత అణచివేత, తీవ్ర అన్యాయం జరిగినప్పుడు ఉనికి కోసం అడ్డుకోవడం తప్ప కశ్మీర్ ప్రజలకు వేరే మార్గం లేదు’ అని పేర్కొన్నారు.