పాలక్కడ్, మార్చి 5: దాదాపు తొమ్మిది పదుల వయస్సున్న అభ్యర్థి ఓ వైపు.. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థి మరోవైపు, ఎన్నికల్లో మొదటిసారి తన అదృష్టం పరీక్షించుకొంటున్న యువ నేత ఇంకోవైపు.. మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ అభ్యర్థిత్వంలో దేశం చూపును తనవైపును తిప్పుకొన్న పాలక్కడ్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇది. పాలక్కడ్ సిటీని ఐదేండ్లలో దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని శ్రీధరన్ తన ప్రచారంలో చెప్తున్నారు. రాజకీయాలు తక్కువగా, అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడతానంటూనే ఇంటింటికి తిరిగి ఓట్ల వేట సాగిస్తున్నారు. 88 ఏండ్ల వయస్సున్న ఆయన సాధారణ రాజకీయ నేతలా ప్రజలకు చేరువ కాలేడన్న విమర్శకులు సైతం ఆయన ప్రచార శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. శ్రీధరన్తో తమ పార్టీ కేరళలో బలపడుతుందని బీజేపీ గట్టిగా భావిస్తున్నది. త్రిముఖ పోరులో మరో నేత 38 ఏండ్ల షఫీ పరంబీర్. కాంగ్రెస్ అభ్యర్థి. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. ప్రజలకు తనపై విశ్వాసం ఉందని పరంబీల్ నమ్ముతున్నారు. ఇక అధికార ఎల్డీఎఫ్ నుంచి ప్రమోద్ బరిలో ఉన్నారు. విజయన్ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రచారాస్త్రంగా చేసుకొన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ఎంబీ రాజేశ్కు 32.83 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు తమకే వస్తాయని ఎల్డీఎఫ్ అంచనా వేస్తున్నది. ఏప్రిల్ 6న కేరళలో ఎన్నికలు జరుగుతాయి.