న్యూఢిల్లీ, మే 21: దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తున్నది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను విదేశాల్లో ఉత్పత్తి చేయగల అవకాశాలను పరిశీలిస్తున్నది. ‘కొవాగ్జిన్’ ఉత్పత్తిని పెంచడంపై డబ్ల్యూహెచ్వోతో కూడా చర్చించాలని భావిస్తున్నది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రుల సమావేశంలో చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతర కంపెనీల టీకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన ఫార్ములా, వలంటరీ లైసెన్స్ను భారతీయ సంస్థలకు ఇచ్చేలా విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర సంస్థలతో కూడా చర్చించాలని ఈ భేటీలో నిర్ణయించారు. దేశీయ వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్న మరో టీకా ‘కొవిషీల్డ్’ ఉత్పత్తిని పెంచడంలో భాగంగా స్వదేశీ సంస్థలకు వలంటరీ లైసెన్సులు ఇచ్చే అంశంపై ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో చర్చించాలని నిర్ణయించారు.
బీఎస్ఎల్-3 ల్యాబ్స్లోనే కొవాగ్జిన్ ఉత్పత్తి
‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ తయారు చేయాలంటే బీఎస్ఎల్-3 సదుపాయాలు అవసరం. ఈ సదుపాయాలు అన్ని ల్యాబ్లలో లేవని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు. ‘కొవాగ్జిన్’ ఉత్పత్తికి బీఎస్ఎల్-3 సదుపాయాలు ఉన్న తయారీ సంస్థలను గుర్తించాలని నిర్ణయించారు.
ఆస్ట్రాజెనెకా టీకా భేష్!
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే కొవిడ్-19 నుంచి 85-90 శాతం రక్షణ లభిస్తుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరణాలను తగ్గించటంలో, దవాఖానల్లో చేరే వారి సంఖ్యను తగ్గించడంలో వ్యాక్సిన్ పనితీరును అంచనా వేసిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు పీహెచ్ఈ తెలిపింది. 30కి పైగా వేరియెంట్లపై ఈ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నది. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచితే రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగమ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. రెండు డోసుల మధ్య వ్యవధిని 3 వారాల నుంచి 12 వారాలకు పెంచితే పెద్దల్లో రోగనిరోధక శక్తి మూడున్నర రెట్లు పెరుగుతుందని వివరించింది.