లక్నో : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అజిత్ సింగ్ ఆర్ఎల్డీ మధురలో అగ్రస్థానంలో నిలిచాయి. కాషాయ పార్టీకి ముఖ్యమైన ఈ మూడు జిల్లాల్లో ప్రత్యర్థులు విజయ పతాక ఎగురవేశారు. నాలుగేళ్ల పదవీకాలంలో యోగి ఈ మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి రానున్న కాలంలో గట్టి ఎదురుదెబ్బే అని తేలింది.
శాసన మండలి ఎన్నిక అనంతరం వారణాసిలో బీజేపీ ఇప్పుడూ పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాషాయ పార్టీ జిల్లా పంచాయతీలోని 40 స్థానాల్లో కేవలం 8 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్వాదీ పార్టీ 14 సీట్లు, బీఎస్పీకి 5 సీట్లు, అప్నాదళ్ (ఎస్) మూడు సీట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం వారణాసిలో తన ఖాతాను తెరిచింది.
మధురలో కూడా బీజేపీ ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. మధురలో బీఎస్పీ 12 సీట్లు, చౌదరి అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్దళ్ 9 సీట్లు గెలుచుకోగా బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఎస్పీ ఒక స్థానంలో గెలుపొంది ఖాతాను తెరిచింది. స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. అయోధ్యలో సైతం బీజేపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. జిల్లాలోని 40 స్థానాల్లో 24 స్థానాలను ఎస్పీ కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 6 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిగిలినవి స్వతంత్రులు స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ రాజకీయ ఎజెండాలో అయోధ్య, మధుర, కాశీ ఈ మూడు జిల్లాలు కేంద్రంగా ఉన్నాయి. అయితే 8 నెలల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికల ఫలితాలు యోగీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.