దక్కన్ చారిత్రక వారసత్వమైన గోల్కొండ కీర్తి కిరీటంలోని కలికితురాయి కుతుబ్షాహీ టూంబ్స్. మన చరిత్రకు సాక్షిగా నిలిచిన ఎత్తయిన గోపురాలతో అలరారే ఈ ప్రాంగణం ఇప్పుడు మరింత అందంగా దర్శనమిస్తున్నది. నాటిచరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఆనవాళ్లుగా నిలిచే టూంబ్స్ రాష్ట్ర పురావస్తు శాఖ, ఆగాఖాన్ ట్రస్ట్ ఆఫ్ కల్చర్ చొరవతో కొత్త అందాలను సంతరించు కున్నాయి.
ప్రపంచంలోని సమాధి ప్రదేశాలన్నింటి కంటే కుతుబ్ షాహీ సమాధులే అతిపెద్ద ప్రదేశంగా గుర్తింపు పొందాయి. గోల్కొండను చూసేందుకు వచ్చిన పర్యాటకులెవరైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశమిది. ఇక్కడి కుతుబ్షాహీ రాజుల సమాధులు, మసీదులు, తారామతి, హుస్సేన్ షావలి సమాధులతో పాటు ఇతర నిర్మాణాలు పర్యాటకుల్ని మురిపిస్తాయి. ప్రపంచ వారసత్వాన్ని కాపాడుకునేందుకు పురావస్తు శాఖ, ఆగాఖాన్ ట్రస్ట్ ఆఫ్ కల్చర్లు కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ ప్రాజెక్టును చేపట్టాయి. టూంబ్స్ పరిరక్షణ కోసం శాస్త్రీయ పద్ధతిలో కృషి చేశారు. టూంబ్స్, మసీదులు, మార్చురీ బాత్, బడీ బౌలి నిర్మాణాలను పునరుద్ధరిస్తూ వీటి పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. అతిపెద్దదైన మెట్లబావి బడీ బౌలి. 400 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ బావి నీటి నిల్వ సామర్థ్యం 10 లక్షల లీటర్లు. బావికి రక్షణగా నిర్మించిన రాతి గోడ దెబ్బతినడంతో పాటు నిర్వహణ లోపం వల్ల బావిలోని నీళ్లు నాచుతో నిండిపోయాయి. 2013లో వచ్చిన వరదలతో బడీ బౌలిలోని కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఈ బడీబౌలిని కూడా చక్కగా పునరుద్ధరించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా 500 ఏళ్ల క్రితం నాటి ముడి పదార్థాలతోనే వన్నెలద్దారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకున్న ఈ సమాధులను వీక్షించడానికి అన్ని కాలాలూ అనుకూలమే.