హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సొంత వనరులు, స్వశక్తితో ఆర్థికాభివృద్ధిలో ఏ రాష్ర్టానికీ అందనంత వేగంతో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర విభజన హామీలను బుట్టదాఖలు చేసిన కేంద్రం, ఏ ఒక్క పరిశ్రమనుగానీ, ఉన్నత విద్య, విజ్ఞాన, ఆరోగ్య సంస్థలనుగానీ ఇవ్వకుండా కాలుగుంజి కిందపడేసే చర్యలకు దిగుతున్నది. తాజాగా రైల్వేశాఖ ప్రకటించిన 75 రైల్ కౌశల్ వికాస్ యోజన (ఆర్కేవీవై) శిక్షణ కేంద్రాల్లో తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి ఇచ్చి చేతులు దులుపుకొన్నది. ఈ శిక్షణ కేంద్రాల్లో అత్యధికం ఉత్తరాది రాష్ర్టాలకే కట్టబెట్టి పక్షపాత బుద్ధిని చాటుకొన్నది.
ఉపాధి శిక్షణకు కీలకం..
భారత రైల్వేల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ముందుగానే శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) కింద ఆర్కేవీవై పేరుతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. పదో తరగతి పాసైన 18-35 ఏండ్లలోపు వయసు నిరుద్యోగులకు వీటిల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా 50 వేల మందికి మూడేండ్లపాటు శిక్షణ ఇస్తామని రైల్వేశాఖ గతంలో ప్రకటించింది. ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిస్ట్, ఫిట్టర్ ట్రేడుల్లో శిక్షణనిస్తారు. జోనల్ శిక్షణ కేంద్రంలో స్థానికంగా మరికొన్ని ట్రేడ్లలో శిక్షణ ఇచ్చుకొనే వెసులుబాటు కల్పించారు. శిక్షణ పొందినవారిని రైల్వేల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకొంటారు.
ఉద్యోగాల్లో ప్రాధాన్యం!
సాధారణ యువతను రైల్వే ఉద్యోగాల్లోకి తీసుకొని, వారికి శిక్షణ ఇవ్వటంలో ఆలస్యం, వ్యయ ప్రయాసలు ఉన్నందున ముందే శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. అంటే ఇకపై రైల్వేల్లో టెక్నికల్ ఉద్యోగాలకు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినవారికే ప్రాధాన్యం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న సెంటర్ల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి రైల్వేల్లో మొత్తం ఉద్యోగుల్లో మూడొంతులు ఉత్తరాదివారే ఉంటారన్న అంచనాలున్నాయి. ఇప్పడు మళ్లీ ఆ రాష్ర్టాలకే స్కిల్ కేంద్రాలు అధికంగా ఇవ్వటంతో కొన్నేండ్ల తర్వాత భారతీయ రైల్వే మొత్తం ఉత్తర భారత రైల్వే అయిపోతుందని ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ 75 కేంద్రాలను 17 రాష్ర్టాల్లో నెలకొల్పుతారు. ఒక్కో కేంద్రంలో 2,500 మందికి శిక్షణ ఇస్తారు. ఈ లెక్కన తెలంగాణలో మూడేండ్లలో 2,500 మందికి శిక్షణ ఇస్తే, ఉత్తరప్రదేశ్లో 10 కేంద్రాల ద్వారా ఏకంగా 25,000 మంది శిక్షణ పొందుతారు. అప్పుడు రైల్వేల్లో ఉద్యోగాల భర్తీ చేపడితే ఎక్కడివారికి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని రాష్ట్ర నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఈ కేంద్రాలను ఏ ప్రాతిపదికన కేటాయించారన్న ప్రశ్నకు రైల్వేశాఖ నుంచి సమాధానమే లేదు.
రైల్వే కౌశల్ శిక్షణ యోజన కేంద్రాల వివరాలు
రాష్ట్రం సంఖ్య
ఉత్తరప్రదేశ్ 10
పశ్చిమబెంగాల్ 10
మహారాష్ట్ర 9
మధ్యప్రదేశ్ 6
బీహార్ 5
రాజస్థాన్ 5
కర్ణాటక 5
ఆంధ్రప్రదేశ్ 4
అస్సాం 4
గుజరాత్ 3
పంజాబ్ 3
ఒడిశా 3
తమిళనాడు 3
ఛత్తీస్గఢ్ 2
జార్ఖండ్ 2
హర్యానా 1
తెలంగాణ 1