పట్టభద్రుల తొలి మహిళా ఎమ్మెల్సీగా వాణీదేవి రికార్డు
మహిళా శక్తిని చాటిన పట్టభద్ర మహిళా ఓటర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ వాణీదేవి చరిత్ర సృష్టించారు. 1956లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటయ్యాక ఇప్పటివరకు పట్టభద్రుల నియోజకవర్గంలో మహిళలు ఎవరూ గెలుపొందలేదు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ శాసన మండలి 40 సీట్లతో 2014లో ఏర్పడింది. అందులో స్థానిక సంస్థల కోటా 14, ఎమ్మెల్యేల కోటా 14, నామినేటెడ్ కోటా 6, టీచర్ల కోటా 3, పట్టభద్రుల కోటాకు 3 స్థానాలున్నాయి. ఇతర కోటాల్లో మహిళలకు అవకాశం దక్కినా పట్టభద్రుల స్థానంలో మహిళ గెలువటం ఇదే తొలిసారి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెగానే కాకుండా ప్రముఖ విద్యావేత్తగా సుపరిచితమైన వాణీదేవికి పట్టభద్రుల ఎన్నికల్లో మహిళా ఓటర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాణీదేవి విజయంతో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పవడమేకాకుండా మండలిలో ప్రాతినిధ్యం కూడా కోల్పోయింది.
వాణీదేవి గురించి క్లుప్తంగా..
జననం: 01-04-1952
స్వగ్రామం: వంగర, కరీంనగర్ జిల్లా
1968: హెచ్ఎస్సీ, ప్రభుత్వ బాలికల పాఠశాల, హైదర్గూడ
1970: పీయూసీ, ఆర్బీ వీఆర్ఆర్ కళాశాల, హైదరాబాద్
1973: బీఏ, ఉస్మానియా యూనివర్సిటీ
1986: డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్టీయూ
1990-1995: జేఎన్టీయూలో లెక్చరర్
పురస్కారాలు
2012: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం.
2014: ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ‘బెస్ట్ ఎడ్యుకేషన్స్ అవార్డు’.
2015: టీఆర్ఎస్ పార్టీ నుంచి ‘విశిష్ఠ మహిళా పురస్కారం’.
2016: తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ అచీవ్మెంట్’ అవార్డు.
2019: హైదరాబాద్లోని శ్రీ కృష్ణదేవరాయ భాషా నిలయం నుంచి ‘రావిచెట్టు లక్ష్మీ నర్సమ్మ సంస్కార పురస్కారం’
2019: రేడియో సిటీ హైదరాబాద్ నుంచి శ్రీవెంకటేశ్వర ఫార్మసీ కాలేజీ, కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కు ‘హైదరాబాద్ సిటీ ఐకాన్’ అవార్డులు.