సిద్దిపేట, మే16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ ఐదో రోజూ ఆదివారం కట్టుదిట్టంగా అమలైంది. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం కావడంతో లాక్డౌన్ సడలింపు సమయంలో మార్కెట్లు జనంతో కిక్కిరిసి పోయాయి. సరిగ్గా పది గంటలకు లాక్డౌన్ అమలులోకి రాగానే జనం ఇంటిబాట పట్టారు. షాపులు బంద్ చేయడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. పోలీసులు ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి , లాక్డౌన్ను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రాలైన సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్తో పాటు ప్రధాన పట్టణాలైన పటాన్చెరు, రామచంద్రాపూర్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోల్, జోగిపేట, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల తదితర పట్టణాలతో పాటు మున్సిపాలిటీలు,మండల కేంద్రాలు, గ్రామాల్లో లాక్డౌన్ పక్కాగా అమలైంది. ఉదయం 6 గంటల నుంచే ఆయా జిల్లాల్లో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చారు. మార్కెట్ల వద్ద కూరగాయలు, పాలు, ఇతరత్రా సామగ్రిని తీసుకున్నారు. 10 గంటలోగా అంతా ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
సంగారెడ్డి జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై జహీరాబాద్ మండలం చెరాక్పల్లి, న్యాల్కల్ మండలం గణేశ్పూర్ వద్ద అంతరాష్ట్ర సరిహద్దున ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఇక్కడ పోలీస్, రెవెన్యూ, వైద్య సిబ్బంది మూడు శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.ఈ-పాస్లున్న వారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు. మూడు జిల్లాల్లో చెక్పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎవరినీ అనుమతించడం లేదు. అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్డౌన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది.న్నారు. అవసరమైతే ధాన్యం నిల్వల కోసం రైతు వేదికలను ఉపయోగించుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులకు సూచించారు.
ఆయా గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రవాణాన్ని పిచికారీ చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం తదితర పనులతో పాటు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని హోం ఐసొలేషన్లో ఉంచి మెడికల్ కిట్లు అందిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెమెడిసివిర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో రెమెడిసివిర్ మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ దవాఖానలో ఈ మందులను ఉచితంగానే అందిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలో ఎమ్మార్పీకి అమ్మేలా చూస్తున్నారు. అధిక రేట్లకు విక్రయించిన, మార్కెటింగ్ చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో సీటీ స్కానింగ్ రూ.2 వేలకు తీసేలా మంత్రి హరీశ్రావు చర్యలు తీసుకుంటున్నారు.