తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ముందే చెప్పానని సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా ప్రచారం కోసం కేరళకు వచ్చారని తెలిపారు. వారంతా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రగల్భాలు పలికారని విమర్శించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ఆ సమయంలోనే తాను చెప్పానని విజయన్ గుర్తు చేశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో అధికార ఎల్డీఎఫ్ విజయం దిశగా దూసుకెళ్లి చరిత్ర సృష్టిస్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానం గెలుచుకోగా ఈసారి అక్కడ కూడా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో 115 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా మరో 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే ఎన్డీయే కూటమి అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు.