కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్14: మూడో విడుత(థర్డ్ వేవ్) కరోనాపై భయాందోళనలు అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎక్స్ పో ప్లాజాలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్పై ప్రజలు భయపడకుండా, ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉన్న గ్రూపులకు ముందుగా టీకాలు వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా సూపర్ స్ప్రెడర్లు, హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగానే సోమవారం నుంచి పది కేటగిరీలకు టీకాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపత్కాలంలో డాక్టర్లు, ఇతర శాఖలు కష్టపడి పనిచేశాయని మంత్రి అభినందించారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో అన్ని రకాల వైద్య సదుపాయాలు, ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నారని చెప్పారు. రాష్ర్టానికి ఎక్కువగా వ్యాక్సిన్లు పంపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఎంవీఐ శ్రీనివాస్రెడ్డి, ఏఎంవీఐ స్వాతిగౌడ్, కౌన్సిలర్లు కిశోర్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ను నెంబర్వన్ చేస్తా..
అన్ని రంగాల్లో మహబూబ్నగర్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలుపుతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని ల్యాండ్మార్క్ బైత్ ఆల్ఖైర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సేవలను అందించడానికి అంబులెన్స్ సర్వీస్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరులో త్వరలో ఐటీ కారిడార్, గ్రీన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కంపెనీల రాకతో జిల్లాలో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉపాధి పొందేలా జిల్లాకు ప్రత్యేక ఏర్పడేలా చేస్తామన్నారు. ఇప్పటి వరకు 17 అంబులెన్స్లను అందజేశామన్నారు. అనంతరం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ల్యాండ్ మార్క్ వారిని మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు షబ్బీర్, షఫీ, తకీఉద్దీన్, రఫీ, వాసి, అస్లాం, ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
రూ.230.85 కోట్ల పంట సాయం
మహబూబ్నగర్, జూన్14: వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించిన రూ.230.85 కోట్లను రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి జమ చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో రైతుబంధు విషయంపై ప్రత్యేకంగా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మాట్లాడారు. 15 నుంచి 25లోపు జిల్లాలోని రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. గతంలో ఆహార ధాన్యాలలో దేశంలో పంజాబ్ మొదటి స్థానంలో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ ఉందన్నారు. రైతుబంధు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బస్తీ దవాఖానాలకు సహకారం
బస్తీ దవాఖానలకు అవసరమైన మానవ వనరుల సహకారానికి జిల్లా యంత్రాంగం ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా యంత్రాంగం, వివిధ ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు సంతకం చేసిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పేదలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సంకల్పంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. నవోదయ, సుశ్రుత దవాఖాన ద్వారా వీరన్నపేట బస్తీ దవాఖాన, ఎస్వీఎస్ ద్వారా ఏనుగొండ బస్తీ దవాఖాన, నేహా షైన్ ద్వారా టీడీ గుట్ట దవాఖానలో వైద్య సేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, సుశ్రుత, నేహాషైన్ దవాఖానల ఎండీలు మధుసూదన్రెడ్డి, విజయ్కాంత్, నవోదయ ఆర్థోపెడిక్ డాక్టర్ నర్సింహులు, ఎస్వీఎస్ నుంచి వేణుగోపాల్ పాల్గొన్నారు.