కొత్తగూడెం : కొవిడ్కు గురైన రోగులు వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్లో ఉండగా అధికారులు వీరిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన కుగ్రామమైన మోద్దులమడలో చోటుచేసుకుంది. గ్రామంలో 150 మంది నివాసులు ఉండగా వీరిలో మహిళలు, పురుషులు కలిపి దాదాపు 50 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరంతా గ్రామంలోని వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని అక్కడే ఐసోలేషన్లో ఉంటున్నారు. కాగా వీరిలో 10 మంది రోగులను రెండు రోజులక్రితమే సున్నంబస్తీ గ్రామంలోని ఆశ్రమం పాఠశాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు అశ్వారావుపేట తహసీల్దార్ సీహెచ్ ప్రసాద రావు తెలిపారు. మిగతా వారు నిరాకరించినట్లు చెప్పారు. పలుమార్ల విజ్ఞప్తి అనంతరం మిగతా వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించామన్నారు.