పట్నా: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో బీహార్కు చెందిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ వృద్ధురాలికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇచ్చారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించారు. పట్నా శివార్లలోని పున్పున్ పట్టణం బేల్దారిచల్ ఏరియా అవధ్పూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అవధ్పూర్ గ్రామానికి చెందిన సునీలా దేవి (65) బుధవారం కొవిడ్ టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి కొవిషీల్డ్, 45 ఏండ్లు పైబడిన వారికి కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. ఈ రెండు రకాల టీకాలను ఒకే గదిలో ఇస్తుండటంతో నిరక్షరాస్యురాలైన నీలాదేవి ముందుగా 18 నుంచి 45 ఏండ్ల వయసువారితో క్యూ లైన్లో నిలబడింది. దాంతో వైద్యులు ఆమెకు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు.
ఆ తర్వాత కాసేపు పక్కన కూర్చోమని చెప్పారు. వైద్యులు చెప్పనట్లే పక్కన కూర్చున్న నీలాదేవి 45 ఏండ్ల పైబడిన వారికి టీకా ఇచ్చే లైన్లో తాను వెళ్లలేదని గ్రహించింది. దాంతో తాను తీసుకున్నది సరైన టీకా కాదనుకుని మళ్లీ రెండో లైన్లో వెళ్లి కొవాగ్జిన్ టీకాను కూడా తీసుకున్నది. అయితే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రెండు రకాల వ్యాక్సిన్ డోసులు తీసుకున్న నీలాదేవికి వెంటనే జ్వరం వచ్చింది.
దాంతో జరిగిన పొరపాటును గ్రహించిన వైద్యులు.. ఆమెను 24 గంటలపాటు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందనే హామీ ఇచ్చి పంపించారు. కానీ గంటల సమయం గడిచినా వైద్యులుగానీ, నర్సులుగానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించలేదు. నీలాదేవికి గొంతు తడారిపోతుంటే ఆమె కుటుంబసభ్యులే గ్లూకోజ్ తాపుతూ సపర్యలు చేశారు. కాగా, నీలాదేవికి వ్యాక్సినేషన్ విషయంలో పొరపాటు తమదేనని అవధ్పూర్కు చెందిన ఏఎన్ఎం అంగీకరించారు.
ఇదిలావుంటే వ్యాక్సినేషన్ సెంటర్కు చెందిన మెడికల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. రెండు రకాల వ్యాక్సిన్లు ఒకే గదిలో వేయడంతో నీలాదేవి పొరబడి రెండు వ్యాక్సిన్లు తీసుకున్నదని చెప్పారు. ఈ విషయంలో తమ సిబ్బంది పొరపాటు కూడా ఉన్నదని ఒప్పుకున్నారు. అయితే రెండు వేర్వేరు వ్యాక్సిన్లవల్ల నీలాదేవిలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఏమీ లేదని సంజయ్ కుమార్ తెలిపారు.