మెదక్ జిల్లాలో 24 టీకా కేంద్రాలు
మెదక్ కలెక్టరేట్లో కరోనా కంట్రోల్ రూం 08452-223360 ఏర్పాటు
మెదక్, ఏప్రిల్ 23 : మెదక్ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా వ్యాక్సినేషన్కు బారులు తీరుతున్నారు. మొదట్లో వ్యాక్సినేషన్కు ఆసక్తి చూపని జనం, కరోనా కేసులు పెరుగుతుండడంతో దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ వ్యాక్సినేషన్ సెంటర్లలో రద్దీ పెరుగుతున్నది. ముందుగా 45 ఏండ్లు పైబడిన వారికే ఈనెల ఒకటో తేదీ నుంచి టీకా వేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, పోలీసులు, మున్సిపల్ వర్కర్లకు టీకాలు వేయగా, రెండో దశలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏండ్లు ఉన్న వారికి టీకాను వేస్తున్నారు.
జిల్లాలో 78,158 మందికి..
మెదక్ జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 2లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు 78,158 మందికి కరోనా వ్యాక్సినేషన్ వేశారు. ఇంకా లక్షా 30వేల మందికి వేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్కు అనూహ్య స్పందన వస్తున్నది. గ్రామాల్లో కరోనా కేసులు పెరుగడంతో పరీక్షలు చేయడంతో పాటు గ్రామాల్లోని పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్కు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీ సెంటర్లలో కరోనా టీకాను వేస్తున్నారు.
24 సెంటర్లలో కరోనా టీకా..
జిల్లాలోని 20 పీహెచ్సీ కేంద్రాలతో పాటు మెదక్ జిల్లా కేంద్ర దవాఖాన, నర్సాపూర్ ఏరియా దవాఖాన, రామాయంపేట, తూప్రాన్ సీహెచ్సీల్లో కరోనా వ్యాక్సినేషన్ను వేస్తున్నారు. గతంలో కంటే పీహెచ్సీల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్కు తరలివస్తున్నారు. దీంతో పీహెచ్సీల్లో బారులు తీరుతున్నారు. గత మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు కరోనా ప్రభావంతో జిల్లాలో 59 మంది మృతి చెందగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 20 రోజుల వ్యవధిలోనే 21 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో స్థానికంగా ఉండేవారితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లి, అక్కడే చనిపోయిన వారి మృతదేహాలను గ్రామాలకు తీసుకువచ్చి దహన సంస్కారాలు చేస్తున్నారు.
కలెక్టరేట్లో కరోనా కంట్రోల్ రూం..
జిల్లాలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ కలెక్టరేట్లో కరోనా హెల్ప్లైన్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ హరీశ్ ప్రారంభించారు. కరోనా వచ్చిన వారితో పాటు హోం ఐసోలేషన్లో ఉన్న వారు ఫోన్ నంబర్ 08452-223360కు ఫోన్ చేసి తమ సందేహాలను, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
అప్రమత్తంగా ఉండాలి..
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని 24 కేంద్రాల్లో కరోనా టీకా వేస్తున్నాం. 45 ఏండ్లు పైబడిన వారందరూ తప్పకుండా టీకా వేయించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.