పాట్నా: బీహార్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు మూడు నెలల్లో పడిపోతుందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. తన నియోజకవర్గమైన రాఘోపూర్లో పర్యటన సందర్భంగా ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవల తేజశ్వి యాదవ్ను సోదరుడిగా పేర్కొనడంతోపాటు చిన్నతనం నుంచి తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో తేజశ్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మరోవైపు ఆర్జేడీ కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీ తేజశ్వి యాదవ్ వ్యాఖ్యలను సమర్థించింది. ఆయన అన్న మాటలకు బలం ఉన్నదని, ఎన్టీయేకు చెందిన కొందరు నేతలు తమను సంప్రదిస్తున్నారని, ప్రభుత్వ వైఖరితో వారు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ నేత కుంతల్ కృష్ణ తెలిపారు.
అయితే తేజశ్వి యాదవ్ వ్యాఖ్యలను అధికార జేడీయూ ఖండించింది. ప్రపంచంలోని ఏ శక్తి కూడా నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఉపేంద్ర కుష్వాహ అన్నారు. తమ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగుతుందని అన్నారు. కొందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారంటూ తేజశ్వికి కౌంటర్ ఇచ్చారు.
కాగా, తేజశ్వి యాదవ్ పగటి కలలు కంటున్నారని బీజేపీ ప్రతినిధి ప్రేమ్ రంజన్ పటేల్ ఎద్దేవా చేశారు. బీహార్ ప్రజలను లేదా తన నియోజక వర్గం ప్రజలను ఆయన పట్టించుకోవడం లేదని, తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోస్టర్లు ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు.
మరోవైపు పప్పు యాదవ్ నేతృత్వంలోని జన అధికార్ పార్టీ (జేఏపీ) కార్యకర్తలు తేజశ్వి యాదవ్కు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కరోనా సమయంలో నియోజకవర్గానికి రాకపోవడంపై విమర్శలు చేశారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఇటీవల బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.