పాట్నా: బీహార్లో ఈ నెల 7 నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా ప్రభుత్వం సడలించింది. ఆగస్ట్ 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప అన్ని షాపులు తెరుచుకుంటాయని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అలాగే ఆగస్ట్ 7 నుంచి స్కూళ్లు కూడా తెరుచుకుంటాయన్నారు. 9, 10 తరగతులకు ఈ నెల 7 నుంచి, 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. కోచింగ్ సెంటర్లు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయని, బస్సులు, ప్రజా రవాణా వంద శాతం సామర్థ్యంతో నడుస్తాయని వెల్లడించారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు కూడా కొన్ని ఆంక్షల మేరకు తెరుచుకుంటాయని వివరించారు. ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ బుధవారం ట్వీట్ చేశారు.