ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లా అధికారులతో సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి మే 6, (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్, కావాల్సిన మందులు ఉన్నాయా? లేవా? అని ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్ బాధితుల పేర్లు మీడియాకు, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తద్వారా కొవిడ్ సోకిన వారు బహిరంగ ప్రదేశాల్లో తిరుగకుండా కఠిన చర్యలు తీసుకోవచ్చన్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, చిట్యాల, కాటారం, కాళేశ్వరం, తాడిచర్ల, మహాముత్తారం, గణపురం మొత్తం ఏడు చోట్ల క్వారంటైన్ సెంటర్లు ఏర్పా టు చేశామన్నారు. కొవిడ్ బాధితులు బహిరంగ ప్రదేశాల్లో తిరుగకుండా క్వారంటైన్ సెంటర్లలో ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. సెంటర్లలో రోజుకు మూడు పూటలా పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఐదు దవాఖానల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కొవిడ్ టెస్టులు, వ్యాక్సిన్ వేస్తున్న పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. కరోనా కట్టడిలో తమవంతు పాత్రపోషిస్తున్న జిల్లాలోని జర్నలిస్టులందరికీ టీకా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సమీక్షలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, ఎంపీపీ మందల లావణ్య, జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధార్సింగ్, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సీఐ వాసుదేవారావు, పీహెచ్సీల వైద్యులు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ
గణపురం : తహసీల్ కార్యాలయంలో గురువారం ఎ మ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముస్లింలకు రంజాన్ కా నుకలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ కరోనా దృష్ట్యా రంజాన్ పండుగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని ముస్లింలకు సూచించారు.
మేకల మండికి భూమి పూజ
మండలంలోని లక్ష్మారెడ్డిపల్లిలో నివాసం ఉంటున్న రాజన్నల కులస్తుల కోసం మేకల మండికి గురువారం ఎమ్మెల్యే గండ్ర భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పక్కనే మేకల మండి ఉండడతో రాజన్నల కులస్తులకు వ్యాపార రీత్యా ఇబ్బంది ఉండేదని, అలా కాకుండా అంద రూ ఒకే చోట మేకల క్రయవిక్రయాలను సులువుగా జరుపుకునేందుకు ప్రత్యేకంగా భూమి పూజ చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కృష్ణచైతన్య, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్ యాదవ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్గౌడ్, మారగాని సరస్వతి, మంద అశోక్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుర్రం తిరుపతిగౌడ్, ఒద్దుల అశోక్ రెడ్డి, కార్యదర్శి స్రవంతి, జిల్లా నాయకులు పోలసాని లక్ష్మీనర్సింహారావు, మోతె కర్ణాకర్ రెడ్డి, చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు, వార్డు సభ్యుడు హమీద్ పాషా, మామిండ్ల సాంబయ్య, కోల జనార్దన్, వడ్లకొండ నారాయణగౌడ్, గుజ్జ గంగాధర్రావు, హఫీజ్, పాషా, రాజన్నల కుల సంఘం నాయకులు మొగిలి చిన్న రాజయ్య, జక్కుల కొమురయ్య, గాదె అంజయ్య పాల్గొన్నారు.