కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు ఎవరైనా ఏదైనా పనిసాధించే విషయంలో పట్టు వదలకుండా విజయం సాధిస్తారో వారిని భగీరథుని పేరుతో కొనియాడటం రివాజు. భగీరథుడు ఘోర తపస్సుతో పరమ శివుడిని ప్రసన్నం చేసుకొని దివినుంచి గంగను భువికి రప్పించిన మహాపురుషుడు. షట్చక్రవర్తుల్లో ఒకరైన సగర చక్రవర్తి వారసుడు భగీరథ మహారాజు. యావత్ సగర (ఉప్పర) జాతికి కులగురువుగా కీర్తింప బడుతున్న భగీరథుని పేరుతో తెలంగాణ ప్రభుత్వం సైతం ‘మిషన్ భగీరథ’పేర బృహత్తర పథకాన్ని కొనసాగిస్తున్నది.
షట్చక్రవర్తుల్లో ఒకరైన సగరచక్రవర్తి భగీరథుడు హరిచంద్ర వంశంలో ఎనిమిదోతరంవాడు. బాహకుడి కుమా రుడైన సగరుడు అయోధ్య నగరానికి రాజుగా ఔర్య ముని సహకారంతో చక్రవర్తి అయ్యాడు. ప్రజల క్షేమం కోసం వశిష్టమహాముని ఆజ్ఞానుసారం అశ్వమేధ యాగా నికి సంకల్పించి యాగాశ్వము వెంట తన సంతానమైన అరవైవేలమంది కుమారులను పంపుతాడు. ఇంద్రుడు అశ్వాన్ని తస్కరించి పాతాళలోకంలో తపస్సు చేస్తున్న కపిల మహర్షి చెంత దాన్ని కట్టివేస్తాడు. యాగాశ్వం తప్పి పోవడంతో సమస్త భూమండలాన్ని గాలిస్తారు. అయినా జాడ దొరకక పోవడంతో పాతాళాన్ని తవ్వి చివరకు కపిల ముని దగ్గర అశ్వాన్ని గుర్తించి దాన్ని ఆ ముని కట్టిపడేసి ఉంటాడని భ్రమించి అతని తపస్సును భగ్నం చేస్తారు. దానికి ఆగ్రహించిన కపిలముని ఆ 60 వేల మంది సగరులను తన శాపాగ్నితో భస్మీపటలం చేస్తాడు.
సగరచక్రవర్తి తన మనుమడైన అంశుమంతుడిని వారి జాడ కోసం పంపుతాడు. అంశుమంతుడు కపిల మహర్షి ని ప్రసన్నం చేసుకుని తన పినతండ్రుల శాప విమోచనాన్ని కోరుతాడు. కైలాస గంగను వారి చితాభస్మంపై ప్రవహింప చేస్తే వారు పునీతులై స్వర్గానికి చేరుకుంటారని చెప్పగా యాగాశ్వాన్ని తీసుకొని అంశుమంతుడు అయోధ్యకి చేరుకుంటాడు. అంశుమంతుడు గంగ కోసం తప స్సు చేస్తూనే తనువు చాలిస్తాడు. అనంతరం అతని కుమారుడైన దిలీప చక్రవర్తి తన భార్య అయిన పద్మాగందితో కలిసి పాలన చేస్తారు. వీరి సంతానంగా జన్మించిన భగీరథుడు సగరవం శంలో ఐదవ తరం వాడు. భగీరథుడి తం డ్రి దిలీపుడు సైతం గంగ కోసం తపస్సు చేసి దానిని సా ధించకుండానే మరణిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భగీరథుడు తన ముత్తాతల కోసం కైలాస గంగను సాధించడానికి హిమాలయాల్లో ఉన్న గోకర్ణం చేరి ఏక పాదంపై తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన గంగ ప్రత్యక్షమై తాను నేరుగా భూమికి చేరితే తన వేగానికి అడవులు పర్వతాలు చిన్నాభిన్నమై ఏ జీవకోటి బతకదని ఆ వేగాన్ని ఆపగలిగేది ఒక్క పరమ శివుడు మాత్రమేనని సెలవిస్తుంది.
భగీరథుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన జటాజూటంలో నింపుకొని భూమిపైకి దారలా వదలగా బిందు సరోవరం నుంచి సగరపుత్రులు తవ్విన ఏడుపాయలలో గంగ ప్రవహించింది. పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గంగ జాహ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తగా ఆగ్రహించిన ముని ఆ గంగను మొత్తంగా తన నోటితో పీల్చి వేస్తాడు. అయితే భగీరథుడు పడ్డ శ్రమను గుర్తించి శాంతించిన ముని చెవుల గుండా గంగను బయటికి వదులుతాడు. సదరు గంగను తన ముత్తాతల భస్మం పై పారించగా శాపవిముక్తులై వారు స్వర్గానికి చేరుతారు. భగీరథుడు ఈ ఘనకార్యాన్ని సాధించి శాశ్వత కీర్తిని పొందాడు.
ఏటా వైశాఖ శుద్ధ సప్తమి రోజున నిర్వహించుకునే ఈ వేడుక గత రెండేండ్లుగా కరోనా కారణంగా జరుపుకొనే వీలు లేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతి ఉత్సవాలను జరపాలని నిర్ణయించటం హర్షణీయం. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా కరోనాతో అసువులు బాస్తున్న ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉన్నది. కరోనాను జయించటం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. వైరస్ ముప్పు నుంచి దేశాన్ని కాపాడటం ఓ భగీరథ ప్రయత్నంగా భావించాలి. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి కలిసికట్టుగా కృషి చేయాలి. ఇదే ఈ వేళ భగీరథుని నిజమైన స్మరణ.
అస్కాని మారుతి సాగర్