పట్నా : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 లాక్డౌన్లు, నియంత్రణలకు బిహార్ భారీ సడలింపులు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పలు నిర్ణయాలు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను యాభై శాతం సిబ్బందితో తెరిచేందుకు అనుమతించారు. కార్యాలయాల్లోకి వ్యాక్సినేషన్ పూర్తయిన పౌరులనే అనుమతిస్తారు.ఇక స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సీఎం స్పష్టం చేశారు.
50 శాతం విద్యార్ధుల హాజరుతో పదకొండు, పన్నెండో తరగతులను తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన విద్యార్ధులకు వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని సీఎం వెల్లడించారు. యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు, భోజనశాలలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కరోనా కట్టడికి బిహార్ ప్రభుత్వం తొలిగా మే 5న రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. ఇక కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్డౌన్ నియంత్రణలకు సీఎం నితీష్ కుమార్లో జూన్లో సడలింపులు ప్రకటించారు.