హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో హరీశ్ రావు తెలిపారు. ‘టీఆర్ఎస్ పార్టీలో నేను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా సీఎం కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కర్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ వైఖరి. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. తన సమస్యలకు , తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు’ హరీశ్ రావు పేర్కొన్నారు.