న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పలు పథకాలను ప్రకటించారు. ఒడిశాలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు బీజు స్వాస్థ్య కల్యాణ్ యోజన కింద స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ఈ ఆరోగ్య కార్డుల ద్వారా మహిళలు సంవత్సరానికి రూ.10 లక్షల వరకు చికిత్స పొందవచ్చని, ఇతర కుటుంబ సభ్యులు రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందుతారని చెప్పారు. కాగా, ఉచిత మంచినీటి పథకాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గోవా ప్రజలకు నెలకు 16,000 లీటర్ల వరకు మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ నెల నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్కు నివాళిగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 27 నుండి ‘దేశభక్తి’ పాఠ్యాంశాలను బోధిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘ఇది ఒక కార్యాచరణ ఆధారిత కోర్సు. పాఠశాల పిల్లలు దేశ అభివృద్ధికి ఎలా దోహదపడాలి అన్నది ఇందులో నేర్పిస్తాం. పిల్లలు ఆపద సమయంలో తమ ధైర్యాన్ని ప్రదర్శించడంతోపాటు అమసరమైతే దేశం కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుతాం’ అని చెప్పారు. అలాగే అక్టోబర్ 2 నుంచి నివాసిత ప్రాంతాల్లో యోగా క్లాసులు నిర్వహిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు.
మరోవైపు పాకిస్థాన్ దుర్మాగపు కుట్రల నుంచి పంజాబ్ను రక్షిస్తామని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు. ‘మేము శాంతిని కోరుకుంటున్నాం. కానీ, మా భూభాగంపై ఎలాంటి దూకుడు లేదా దాడిని సహించం. వారు (పాకిస్థాన్) సాహసం చేయడానికి ప్రయత్నిస్తే వారికి జీవితకాల గుణ పాఠాన్ని బోధిస్తాం’ అని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతుల తరుఫున పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.