అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా..
తాజా ప్రకటనతో గిరిజనుల్లో సంతోషం
మహబూబాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలకు కూడా అనుమతినిచ్చారు. సోమవారం హైదరాబాద్లో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2018 అసెంబ్లీ, 2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభల్లోనూ మానుకోటలో మెడికల్ కళాశాలను కచ్చితంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ఏర్పడిన కొత్తలో ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితమే ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా చేశారు. అంతేగాక ఇటీవల రీజినల్ సబ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇందులో మహబూబాబాద్ కూడా ఉంది. ఈ రీజినల్ సబ్ సెంటర్ పరిధిలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు యుద్ధప్రాతిపాదికన మందులు అందించనున్నారు. మందులు నిల్వ చేయడానికి సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మహబూబాబాద్లో ఏర్పాటు చేసే రీజినల్ సబ్సెంటర్ ద్వారానే సంబంధిత పీహెచ్సీలకు, సీహెచ్సీ, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు ఇక్కడినుంచి తీసుకెళ్లనున్నారు.
గిరిజనులకు అందనున్న మెరుగైన వైద్యం
సీఎం కేసీఆర్ ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ మెడికల్ కళాశాల ఒక్కటే ఉంది. 40 సంవత్సరాల క్రితం దీనిని వరంగల్లో ఏర్పాటుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది రెండో మెడికల్ కళాశాల కావడం విశేషం. మానుకోటకు మెడికల్ కళాశాల రావడంతో గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. మెడికల్ కళాశాలలో సుమారుగా వంద వరకు డాక్టర్ సీట్లు ఉంటాయి. వీరందరు ఇక్కడే చదువుతూ ఇక్కడి ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తుంటారు. తద్వారా ప్రజలకు వందలాది మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఈమేరకు కళాశాల కోసం జిల్లా యంత్రాంగం స్థలాన్ని పరిశీలిస్తోంది.