పుణె: జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం .. వరద నీటిలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఖేడ్కు సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం జలమయం అయ్యింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది. అయితే గత కొన్ని రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతంలో దిగువన ఉన్న ఈ ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కొండ మీద నుంచి ఆలయం కింద వైపు ఉదృత స్థాయిలో బురద నీరు ప్రవహిస్తోంది. దీంతో గర్భాలయంలో ఉన్న శివలింగం పూర్తిగా నీట మునిగింది. భీమశంకరుడి చట్టు చేరుకున్న నీటిని తొలగించేందుకు ఆలయ పూజారులు ప్రయత్నిస్తున్నారు.
పుణె జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ముంబైలోని గోవండి ప్రాంతంలో బిల్డింగ్ కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఏడు మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో.. ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాల సాయం అందిస్తామన్నారు. రాయిగడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 30 మంది గల్లంతు అయ్యారు.