న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఎలక్ట్రానిక్ వాహనాల కోసం సౌరశక్తితో నడిచే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ-చండీగఢ్ హైవేలో కర్నా లేక్ రిసార్ట్ వద్ద తొలి అత్యాధునిక చార్జింగ్ స్టేషన్ను నెలకొల్పింది. ఈ స్టేషన్ను కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. భెల్ సీఎండీ నళిన్ సింఘాల్, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్ గోయిల్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవం జరిగినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ హైవేలో ప్రతీ 25-30 కిలోమీటర్లకు సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుచేయడంతో పాటు ఇతర చార్జింగ్ స్టేషన్లను అప్గ్రేడ్ చేయనున్నట్లు భెల్ తెలిపింది.