హైదరాబాద్సిటీబ్యూ రో ప్రధాన ప్రతినిధి, మే 19 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ బాధితుల్లో చాలామందికి వాయునాళాలు మూసుకుపోతుండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని వైద్య నిపుణులు స్పష్టంచేశారు. దీంతోపాటు వారి కండ్లు, చెంపల వద్ద వాపు ఎక్కువగా కనిపిస్తున్నదన్నారు. ఈ లక్షణాల ద్వారానే వారికి బ్లాక్ ఫంగస్ సోకినట్లుగా గుర్తించి కోఠి ఈఎన్టీ దవాఖానలోని ప్రత్యేక నోడల్ కేంద్రానికి తరలిస్తున్నామని, బాధితుల్లో 99% మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారని తెలిపారు. దీంతో మధుమేహ పీడితులకు బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది.
బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి ప్రధానంగా రెండుదశల్లో చికిత్స అందిస్తున్నామని, సమస్యను ఆదిలోనే గుర్తించిన వారిలో ఈ ఫంగస్ను నియంత్రించడం సాధ్యమవుతున్నదని వైద్యులు తెలిపారు. ఫంగస్ కల్చర్ పరీక్షలు నిర్వహించిన తర్వాత చెడిపోయిన భాగాన్ని ఎండోస్కోపీ ద్వారా చెడిపోయిన భాగాన్ని తొలగించి మరింత వ్యాప్తి చెందకుండా నివారిస్తున్నామని, అనంతరం 10-14 రోజుల పాటు యాంటీ ఫంగస్ చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తున్నామని వివరించారు. బ్లాక్ ఫంగస్పై అవగాహనలేక ఆదిలోనే వ్యాధిని గుర్తించలేకపోతున్నవారిలో ఆ ఫం గస్ మెదడుకు చేరుతున్నదని, దీంతో అలాంటివారికి చికిత్స అం దించడం చాలా సంక్లిష్టంగా మారుతున్నదని వైద్యులు తెలిపారు.