న్యూఢిల్లీ: భారత్ ఇవాళ రికార్డు క్రియేట్ చేసింది. నేటితో వంద కోట్ల కోవిడ్ డోసులను పంపిణీ చేసింది. దీనిపై భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ సంస్థలు స్పందించాయి. ఈ చరిత్రాత్మకమైన ఘనత సాధించడంలో తాము కూడా భాగస్వామ్యులు కావడం గర్వంగా ఉందని భారత్ బయోటెక్ సంస్థ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ప్రభుత్వం, వ్యాక్సిన్ తయారీదారులు, హెల్త్కేర్ వర్కర్లు, వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు, కలిసికట్టుగా అందరు చేసిన ప్రయత్న ఫలితమే ఇది అని ఎల్లా అన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఇదే నిజమైన సక్సెస్ స్టోరీ అని భారత్ బయోటెక్ ఎండీ చెప్పారు.
సీరం ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇండియా ఓనర్ ఆధార్ పూనావాలా కూడా వంద కోట్ల డోసుల పంపిణీపై స్పందించారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వంద కోట్ల డోసుల పంపిణీ సాధ్యమైందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఏజెన్సీలు, హెల్త్ కేర్ వర్కర్లు.. మహమ్మారి నియంత్రణకు నిరంతరం శ్రమించారని, వారందరికీ కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆధార్ పూనావాలా ట్వీట్ చేశారు.
భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలను, సీరం సంస్థ కోవీషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.