హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరుతాడన్న వార్తలపై కమలం నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈటల రాకను కొంతమంది బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈటల రాజేందర్ కమలం పార్టీలోకి వస్తున్నాడన్న వార్తలపై బీజేపీ నాయకుడు అరుకాల వీరేశలింగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదన్నారు. తనను సంప్రదించకుండా ఈటలను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ఒక వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో తనను అడగకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్లో వివేక్ ఫామ్హౌస్లో చర్చలు జరిపినప్పుడు తాను గుర్తుకు రాలేదా? అని అడిగారు. స్థానిక ప్రతినిధిని అయిన తనను సంప్రదించకుండా చర్చలు ఎలా జరుపుతారు? అని ఇనుగాల పెద్దిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.