మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు తార్నాకలోని రాజ్యాభిలేఖనం కార్యాలయంలో మంగళవారం పురాతన పహాణీల పరిశీలనలో పలు పత్రాలు లభించినట్టు సమాచారం. ఉర్దూ భాషలో ఉన్న ఈ పత్రాలను ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొని ఇంగ్లిష్లోకి తర్జుమా చేసేందుకు ఉర్దూ బాషా సీనియర్ ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటున్నారు. నివేదికను గురువారం నాటికి సిద్ధం చేయనున్నారు. ఆక్రమణదారులకు, అక్రమ నిర్మాణాలకు వివిధ విభాగాలు ఇచ్చిన అనుమతుల ఆధారంగా నాటి అధికారులను, ఉద్యోగులను సుమారు 60 మందిని విచారించారు. విచారణ నివేదికను పూర్తి ఆధారాలతో సహా బుధవారం సిద్ధంచేసినట్టు సమాచారం. నేడో రేపో వీటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు.
రాజ్యాభిలేఖనం కార్యాలయంలో లభించిన పురాతన పత్రాలు దేవర భూముల వ్యవహారంలో కీలకం కానున్నాయి. 1924- 25లో నిజాంవద్ద విధులు నిర్వహించిన రామిడి పుల్లయ్య దేవరయాంజాల్లోని వందల ఏండ్ల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయానికి సర్వే నంబర్ 91లోని 1,525 ఎకరాల భూమిని నవాబుతో రాయించి ఇచ్చారు. ఆ పత్రాలు రాజ్యాభిలేఖనం కార్యాలయంలో లభ్యమైనట్టు తెలుస్తున్నది. వాటిని ఇంగ్లిష్లోకి అనువదిస్తే పూర్తి ఆధారాలు లభించినట్టే.