న్యూఢిల్లీ, జూన్ 22: ఇటీవల అనూహ్యస్థాయిలో విజయవంతమైన ‘పశ్చిమబెంగాల్ తరహా వ్యూహాన్ని’ 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్ ఎన్నికల రణరంగం యావత్తూ అటు దీదీ ఇటు మోదీ అన్న రీతిలో సాగిన విషయం తెలిసిందే. మూడేండ్ల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో మోదీని గద్దె దించాలంటే.. ఇదే తరహా ప్రత్యక్షపోరు వ్యూహాన్ని అవలంబించాలని విపక్షనేతలు యోచిస్తున్నారు. తమ కూటమికి థర్డ్ఫ్రంట్ అనే పేరు పెట్టకుండా, దేశంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు మోదీని ఎదుర్కొనే ఓ నేతను కూడా ముందుకు తీసుకురావచ్చని, మమతకే ఆ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత కూడా ప్రశాంత్కిశోర్ మమత తరఫున పని చేయటం చూస్తుంటే.. దీదీని విపక్షాల ‘ఏకగ్రీవ అభ్యర్థి’గా ప్రకటింపజేసి.. లోక్సభ ఎన్నికల్ని కూడా దీదీ, మోదీ తరహా పోరాటంగా మార్చటమే ప్రశాంత్ కిశోర్ వ్యూహం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.