కోల్కతా : నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో.. తృణమూల్ కార్యకర్తలు ఆగ్రహాంతో ఊగిపోయారు. కోల్కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ వ్యవహారంపై ఆ రాష్ర్ట గవర్నర్ జగదీప్ ధనఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం, రాళ్ల దాడి చేయడం టీవీ చానెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా చూశాను. కోల్కతా, బెంగాల్ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయకుండా, ప్రేక్షకపాత్ర వహించడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాలని గవర్నర్ పోలీసులకు సూచించారు.
ఈ కేసులో నలుగురు తృణమూల్ నేతలపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి గవర్నర్ జగదీప్ ధనఖర్ అనుమతి ఇచ్చారు. స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆ తర్వాత వారిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి సీఎం అయిన మమతా బెనర్జీ క్యాబినెట్లో ఫిర్హద్, సుబ్రతా ముఖర్జీలు మంత్రులుగా ఉన్నారు.