గజ్వేల్అర్బన్, మే 13 : కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గురువారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. పటిష్టంగా లాక్డౌన్ విధించడంతో గురువారం సడలింపు సమయంలో అధికసంఖ్యలో మార్కెట్లకు వచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్ అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ఉదయం 10గంటల తర్వాత అన్ని ప్రధాన కూడళ్లు, రహదారులతోపాటు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమీకృత మార్కెట్లో ఏఎంసీ కార్యదర్శి జాన్వెస్లీ లాక్డౌన్ అమలును పరిశీలించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలి
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. లాక్డౌన్లో భాగంగా ఆయన గురువారం పట్టణంలోని పలు చౌరస్తాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 10 గంటల తరువాత ఎవరైనా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పలు ప్రదేశాల్లో పర్యవేక్షించి బందోబస్తు గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, రాత్రి నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని కోరారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు, సీఐ పరశురామ్గౌడ్, పోలీసులు పాల్గొన్నారు.
ప్రశాంత్నగర్లో లాక్డౌన్
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రశాంత్నగర్లో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తున్నారు. దీంతో ఉదయం 10 గంటల తరువాత రోడ్లు అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
ప్రజలకు అవగాహన కల్పించిన యంత్రాంగం
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రెండో రోజూ గురువారం సంపూర్ణంగా జరిగింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు లాక్డౌన్ పాటించాలని కోరుతూ జిల్లా కేంద్రం సిద్దిపేటలోని పలు వార్డుల్లో పర్యటించి, ప్రజలకు సూచనలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి వ్యాపార సముదాయాలు మూసివేయడంతో పట్టణంలోని మెయిన్ రోడ్లతో పాటు వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మినహాయింపు ఉండడంతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు యథావిథిగా కొనసాగాయి. పోలీసులు లాక్డౌన్ అమలు కోసం పట్టణంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. జనాలు రోడ్లపైకి రాకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు. చెక్పోస్టులు, పికెటింగ్లు ఏర్పాటు చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు కూడా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్కు మద్ధతుగా స్వచ్ఛందంగా ఇండ్ల నుంచి బయటకు రాలేదు.