మంగుళూరు: కోవిడ్ టెన్షన్ తట్టుకోలేక కర్నాటకలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్నది. కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో మంగుళూరుకు చెందిన దంపతులు ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న 40 ఏళ్ల రమేశ్, ఆయన భార్య గునా సువర్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తలు కోవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారు. అయితే సోమవారం ఆ జంట మంగుళూరు పోలీసు కమీషనర్కు ఓ వాయిస్ మెసేజ్ చేశారు. కరోనా వ్యాధి గురించి మీడియాలో వస్తున్న కథనాలు మమ్ముల్ని తీవ్ర వత్తడికి లోను చేస్తున్నాయని, ఆ వత్తడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ మెసేజ్లో తెలిపారు. ఆ వాయిస్ మెసేజ్ విన్న వెంటనే కమిషనర్ రియాక్ట్ అయ్యారు. తొందరపడి ఎటువంటి హానికి పాల్పడవద్దు అని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ జంటను ఆదుకోవాలని స్థానిక మీడియా గ్రూపులకు ఆయన విషయాన్ని తెలియజేశారు. కానీ ఆ దంపతులు ఉంటున్న అపార్ట్మెంట్కు పోలీసులు చేరుకునే లోగా.. వాళ్లు మృతిచెందినట్లు తేల్చారు.
అపార్ట్మెంట్లో సూసైడ్నోట్ను గుర్తించారు. దాంట్లో సువర్ణ మరో కారణాన్ని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. పుట్టిన 13 రోజులకే తమ శిశువు మరణించడం పట్ల ఆమె ఆందోళనగా ఉంది. ఇక రోజుకు రెండు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకున్నా.. డయాబెటిస్ తగ్గడం లేదని ఆమె ఆ నోట్లో ఆందోళన వ్యక్తం చేసింది. తమకు చెందిన ఆస్తులను పేదవాళ్లకు పంచిపెట్టాలని ఆ మరణవాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల కేసు నమోదు చేశారు.