బెంగళూరు: ఇప్పుడు దేశంలో ప్రతి అంశాన్ని తాలిబన్తో ముడిపెట్టడం పరిపాటిగా మారింది. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లడ్ ఇదే పాట పాడారు. దేశంలో ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదలకు ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల సంక్షోభమే కారణమని అన్నారు. ‘ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ సంక్షోభం కారణంగా, ముడి చమురు సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలకు కారణాలను అర్థం చేసుకొనే పరిపక్వత ఓటర్లకు ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అరవింద్ బెల్లడ్, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప స్థానాన్ని భర్తీ చేయవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అలాంటి బీజేపీ సీనియర్ నేత దేశంలో ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదలకు తాలిబన్ సంక్షోభమే కారణమని చెప్పడంపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.